13.5 C
New York
Tuesday, May 14, 2024

ఎఱ్ఱాప్రెగడ రచనా సౌందర్యాన్ని అందించిన యశోదారెడ్డి

– ఆచార్య కరిమిండ్ల లావణ్య

వ్యాస ముఖ్యోద్దేశం (Importance of Article) :

కవిత్రయంలో ప్రధాన భూమికను పోషించిన కవి ఎర్రన. ఈయన కవిత్వంలోని సౌందర్యాన్ని కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలైన డా॥ పి. యశోదారెడ్డిగారు విశ్లేషించిన తీరును అధివిమర్శ చేయటం.

వ్యాసంలోని ప్రధాన పదాలు (Key words of the Article) :

భావగతి ప్రబంధ నిర్మాణం, సంభాషణా చాతుర్యం, కవిత్వానుశీలన, భావవైవిధ్యం, పంచమవేదం, వేదశిఖ, రస నిర్వహణ, పంచలక్షణాలు, వైకుంఠప్పుర వర్లన, రాజపోషణ, మనోవృత్తి, కథాసూత్రం, విచిత్ర పదప్రయోగ వైచిత్రం, సూక్తివైచిత్రి, సహజ పరిశీలనాదృష్టి.

వ్యాస పరిచయం (Introduction of Article) :

ఎర్రన కవిత్వ విలక్షతను పరిచయం చేస్తూ, ఎర్రన కవిత్వ ప్రత్యేకతను వివరిస్తూ, మిగతా కవుల కవిత్వం కన్నా భిన్నంగా ఎర్రన కవితా తీరుతెన్నులు వ్యాసంలో చర్చిస్తాను.

విషయ ప్రధానమైన భావగతి, నిండైన వర్ణనలు, సంపూర్ణ రస నిర్వహణ ఎర్రన కవితా లక్షణాలు. పురాణ మార్గం నుండి దేశిమార్గం వైపు, జాను తెనుగువైపు పాఠకులను మళ్లించి నూతన సాహిత్య నిర్మాణాన్ని చేసినవాడు నాచనసోమన. ఈ ఇద్దరి కవిత్వాలను, సాహిత్య పరిణామాలను లోతుగా అధ్యయనం చేసిన డా॥ పాకాల యశోదారెడ్డి ఆధునిక సాహిత్య నిర్మాణానికి సాహితీ బాటను నిర్మించింది. “తెలుగులో హరివంశాలు” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 11.10. పరిశోధన చేసి ప్రాచ్య, ఆధునిక రచయిత్రిగా, విమర్శకురాలుగా తెలుగు సాహితీ రంగంలో సుస్థిర స్థానాన్ని పొందింది.

తెలుగు సాహిత్య వికాసంలో ఎర్రన ప్రబంధ నిర్మాణానికి బలమైన భూమికను, పునాదిని నిర్మించి “బుషిగా” కన్పిస్తే, నాచనసోమన పాత్రల మూర్తి కల్పనా, సంభాషణా చాతుర్యంతో పద్యాల విరుపులతో, జాతీయాలు సామెతలతో కవిత్వాన్ని వ్రాసి నవీనగుణసనాథుడైన “కవి’ గా కన్పించాడు. ఈ ఇద్దరి కవిత్వ గుణాలను తనలో ఆకళింపు చేసుకొని యశోదారెడ్డి _ “సాహితీ తపస్విగా తనదంటూ ప్రత్యేక ముద్రను సాహితీ ప్రస్థానంలో స్థిరీకరించింది. తాను చెప్పదలచుకుంది, వ్రాయదలచుకుందీ సూటిగా చెప్పి, వ్రాసి భావి పరిశోధకులకు కావల్సినంతగా సాహిత్య ప్రయోగాన్ని చేసింది.

ఇంగ్లీష్‌లో “లలత వశీయి 08 10[థ43” అనే పేరు మీద ఆ వాజ్బయంలోని మహాకవుల, రచయితల జీవిత విశేషాలకు, రచనా సౌందర్య విశేషాలను విశదీకరించే విమర్శ గ్రంథ పరంపర ఒకటున్నది. దాని మాదిరిగానే ఆంధ్ర వాజ్మయంలో ప్రముఖ కవుల జీవిత రచనా విశేషాలను వెలువరించాలనే ఉద్దేశంతో ఆచార్య దివాకర్ల వెంకటావధాని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నపుడు యు,జి.సి. వారి సహాయంతో “ఆంధ్రకవి నక్షత్రమాల”” అనే పేరుతో 27 గ్రంథాలను ప్రచురించాలని సంకల్పించాడు. అందులో రెండవది “ఎట్టాప్రైగడ” గ్రంథం. 1972, డిసెంబరులో ప్రచురితమైన ఈ గ్రంథం డా॥ పాకాల యశోదారెడ్డి వ్రాసింది. ఎజ్బ్టాపైగడ తాత, తండ్రుల వివరాలను మొదలుకొని, ఎర్రన వ్యక్తిత్వంతో పాటు, ఆయన రచనల సారాన్నంతా కూలంకషంగా యశోదారెడ్డి ఈ గ్రంథంలో వివరించింది.

తెలంగాణ ప్రాంత యాసతో ఈ ప్రాంత భాషా నిర్మాణానికి పునాది ఎఱ్ఱాప్రెగడ రచనా సౌందర్యాన్ని అందించిన యశోదారెడ్డి వేసిన యశోదారెడ్డి కథలు ఎంత ప్రాచుర్యం పొందినా, తెలంగాణా సమాజాన్ని కదిలించినా ముందుగా ఆమె విమర్శకురాలని నా అభిప్రాయం. ప్రాచీన కవిత్వాన్నంతా అధ్యయనం చేసి దానిపై పూర్తి పట్టును సాధించింది. ఆధునిక సాహిత్యంలో అతి తక్కువ మంది మొదటి తరం విమర్శకుల్లో ప్రముఖ స్థానం యశోదారెడ్డిది. ఈమె మూలగ్రంథాలనే అధ్యయనం చేసింది. అందుకుగాను సంస్కృతం, ప్రాకృతం, జర్మన్‌ వంటి భాషలను నేర్చుకొని మూలాల సారాంశాల కోసం వెతుకులాడిరది. ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన కృషి, వెలువరించిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. మహిళలు చదువుకునే పరిస్థితులు సమాజంలోలేని కాలంలో చదువుకొని, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అందరికీ జ్ఞానోదయం కలిగించింది.

“ఎఱ్ఱాప్రెగడ” కవిత్వానుశీలనలో ఎర్రనది ప్రబంధ లక్షణాలున్న సహజ కవిత్వమని యశోదారెడ్డి అభిప్రాయం. కావ్య ప్రయోజనాన్ని ఆశించి, కావ్య రచన చేయడం ఎర్రన కవిత్వ లక్షణాల్లో ప్రధానమైంది. అందుకే ఎర్రన రామాయణంలోనూ, మహాభారత అరణ్యపర్వశేషభాగ రచనలోనూ, నృసింహ పురాణంలోనూ, హరివంశంలోనూ కావ్య ప్రయోజన సాధనకోసం ప్రబంధరచనా ప్రావీణ్యం, చమత్కారంగా వ్రాసే సామర్భ్యాన్ని కలిగి ఉన్నారనే అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలిబుచ్చారు.

ఎర్రాపైగడ జీవించిన కాలాన్ని వీరేశలింగం పంతులు పరిశోధన ఆధారంగా, చరిత్ర గ్రంథాల ఆధారంగా క్రీ॥శ॥ 1280-85 మధ్యకాలంలో పుట్టి, 1355 వరకు జీవించివున్నాడని తెలిపారు. విష్ణు పారమ్య ప్రతిబోధకాలైన రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషభాగం, నృసింహపురాణం ఎర్రన రచనలు. ఇవన్నీ విష్ణుభక్తి ప్రతిబోధకాలే. నేడు రామాయణం ఆధారంగా కందుకూరి వీరేశలింగం పంతులు, శేషాద్రి రమణ కవులు, పింగళి లక్ష్మీ కాంతం, వేదాల తిరువేంగళాచారి, దివాకర్ల వేంకటావధాని, చాగంటి శేషయ్య, వేలూరి శివరామశాస్త్రి, వేదాల తిరువేంగాళాచార్యులు, నోరి నరసింహశాస్త్రి, పరిశోధనలను అనుసరించి, ఎర్రన మొదట రామాయణ హరివంశాలను తరువాత అరణ్య పర్వశేషం, నృసింహపురాణాలను వాసినట్ట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడింది.

నోరి నరసింహశాస్త్రి “ఈశ్వర ప్రణిపాతములో గూడిన విజ్ఞాన యోగమునందభినివేశము కలిగిన సమాధిని నిమీలితేక్షణుండనై క్షణంబున్న” అని చెప్పుకున్న వాక్యం అప్రయత్నంగా వచ్చిన సత్యవాక్యమని కవి ఆధ్యాత్మికోన్నతిని పొగిడినాడు. దీన్ని బట్టి నసింహపురాణమే మొదటిదని చెప్పినా యశోదారెడ్డి అందుకు అంగీకరించలేదు. ఆత్మోన్నతి కలిగిన మహాకవికి నృసింహపురాణం బాల్య రచన కాదనేది యశోదారెడ్డి అభిప్రాయం.

ఎర్రన నృసింహ పురాణంలో “ఎన్నికమై బ్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశేషోన్నయమంద్ర భాష సుజనోచ్చ మెప్పగ నిర్వహించితి”నని చెప్పినాడు. చదులవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “ప్రతిభతో నారణ్యపర్వశేషము ). జెప్పె కవులకు జెవుల పండువులుగాగ” అని ఎర్రన అరణ్యపర్వశేషమును చెప్పినట్టు ధృవపరిచాడు. జక్కన విక్రమార్క చరిత్రలోనూ “ఈత్రయిదా ‘బ్రబంధ పరమేశ్వరుడై విరచించె శబ్దవైచిత్రి నరణ్య పర్వమున శేషము” అని శబ్దవైచిత్రితో ఎర్రన అరణ్య పర్వశేషం వ్రాసెనని చెప్పాడు. ఈ ఆధారాలను తీసుకొని యశోదారెడ్డి అరణ్య పర్వశేష భాగం ఎర్రనే వ్రాసినాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

భారతమూలరచనను పరిశీలించి నన్నయ కన్నా ఎక్కువగా మూలాన్ని అనుసరించాడన్నది. నన్నయ తిక్కనల కన్నా, ఎర్రనే ఆంధ్రమహాభారతలక్ష్మిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడని, వారిద్దరూ సంపూర్ణ భారతాన్ని అందించలేదని ఎర్రన భారత రచన తరువాతే ఫలవంతమైందని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

సంస్కృత భారతంలో శరదృతువు వర్లన ఏడు (7) శ్లోకాల్లో ఉంటే, నన్నయ శ్లోక సారాంశాన్ని కలుపుకొని “(1) భూసతికిం దివంబునకు బొల్పె సగంగ శరత్సమాగమం…”, (2) శారద రాత్రు లుజ్వలలస్తతర తారక హార పంక్తులం…”, అనే రెండు పద్యాల్లో శరదృతువు యొక్క ప్రధాన లక్షణాలను చెప్పినాడు. ఈ పద్యాల తరువాతే ఉన్న “స్ఫురదరుణాంశు రాగ రుచి బొంపిరివోయి” పద్యాన్ని పరిశీలించినపుడు పూర్తిగా మూల భారత అనువాదంగానే కనిపించింది. దీంతో భారత రచనా విధాన భేదాన్ని గుర్తించవచ్చు. శ్రీకృష్ణుడు సత్యభామతో పాండవుల దగ్గరకు వచ్చిన సందర్భంలో మూలగ్రంథంలో ఉన్న బుతు వర్ణనను పరిశీలించినపుడు మూల శ్లోకాలకు మెరుగులు దిద్దినట్లుగా _ కనబడిరది. మూలగ్రంథంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రశంసించిన సందర్భంలో, ద్రౌపదిని ఆమె కుమారుల క్షేమాన్ని గురించి అడిగిన _ సందర్భంలోనూ మూలంలోని శ్లోకాలు భావ వైవిధ్యం లేక చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పినట్లుగా ఉన్నదని, మూలశ్లోక భావాన్నంతటిని సమీకరించినట్టున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

సంస్కృత భారతంలోని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినట్లున్న రామాయణ కథాభాగం అనువదించిన విధానాన్ని పోల్చి చూసినపుడు మూలశ్లోక భావాన్ని తప్పక యతి సమర్హుడై వర్ణించాడు ఎర్రన. మూలభారతంలోని రావణ సంహారములో రాముడు బ్రహ్మాస్త్ర సంధానం చేసాడని అది రావణుని నీరుగావించిందని ఉంది. బ్రహ్మాస్త్ర సంధానం తరువాత దేవదానవ కిన్నెరాదులు రావణున కాయురల్వావశేషమై ఉన్నదని తలచినట్లున్నదన్న విషయాన్ని వదిలిపెట్టాడు. అశోకవనంలో ఉన్న సీతతో రావణ సంవాదం తరువాత వాల్మీకి రామాయణంలో త్రిజటా స్వప్న వృత్తాంతం ఉన్నది. మూలభారతంలో త్రిజటా స్వప్న వృత్తాంతం తరువాతే సీతారావణ సంవాదం ఉంది. ఎర్రన భారత కథనం ప్రకారమే అనువాదము చేసినాడు. 30 శ్లోకాల సంభాషణను 7 గద్య పద్యాలల్లోనే వర్ణించాడు ఎర్రన. అంటే భారతంలో రామాయణం ఇతివృత్త ప్రాధాన్యం కొంతవరకే అవసరమని గుర్తించాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

హరివంశంలోని “నా తమ్ముండు ఘనుండు అనే పద్యంలో రామకథమున్‌ జెప్పించి యత్యుత్తమ ఖ్యాతింబొందితి నింకనేను” అనే పద్యాల్లోనూ, కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సారసంగ్రహంలోని అనేక సందర్భాల్లో ఎర్రన పద్యాలను ప్రస్తావించడంలోనూ, గణపవరపు వేంకటకవి ప్రయోగ రత్నాకరమనే లక్షణ గ్రంథంలోనూ, చెదలువాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోనూ, ఆనందరంగకవి ఆనందరంగరాట్ఫందములోనూ, ఎర్రన రామాయణ ప్రస్తావనలున్నాయి. ఎర్రన కాలంలోనే భాస్కర రామాయణం రాయబడిరది. అయినా ఎర్రన రాసివున్నట్లుగా అనేక ఆధారాలున్నందున మనోజ్ఞంగా రామాయణం కూడ రాసే ఉంటాడని యశోదారెడ్డి బలంగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మహాభారతం పంచమ వేదమైతే, హరివంశం వేదశిఖ అని యశోదారెడ్డి అభిప్రాయం. భారతంలో శ్రీ కృష్ణుని గురించి సూక్ష్మంగా, వ్యంగ్యంగా చెప్పబడితే, హరివంశంలో విపులంగా, వాచ్యంగా శ్రీహరి చరిత్ర వర్ణింపబడిరది. మహాభారత యుద్ధం, క్షత్రియ సంహారంతో పాఠకుని మనస్సు బాధతో నిండి ఉంటుంది. పాఠకునిలో నిర్వేదవైరాగ్యాలను తొలగించడానికి హరివంశం రాయబడిరది. ప్రోలయ వేమారెడ్డి ఎర్రనను హరివంశ రచన చేయమని కోరగా, ఇదివరకే నన్నయ తిక్కనలు భారత రచన చేసినారు. వారి త్రోవలో నడుచుటకు సంతోషంగా ఉంది. హరివంశం, భారతం రెండూ కూడ వ్యాసమహర్షి రాసినవే అని హరివంశ పీఠికలో అనడంతో హరివంశ రచనాకాలం నాటికే భారత అరణ్యపర్వశేషం రాయలేదని స్పష్టంగా _ తెలుస్తున్నదనే అభిప్రాయాన్ని మార్త వ్యక్తపం చింది.

సంస్కృతంలో హరివంశపర్వము, విష్ణుపర్వము, భవిష్యపర్వములుంటే, ఎర్రన మూలగ్రంథాన్ని అనుసరించలేదని తెలుస్తున్నది. పూర్వభాగంలో _ తొమ్మిది ఆశ్వాసాలు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలుగా ఎర్రన విభజించి అనువదించాడు. అయితే ఇక్కడ నాచనసోముని ఉత్తర హరివంశాన్ని గురించి కొంత చెప్పుకోవాలి. నాచనసోమన ఉత్తర హరివంశాన్ని ఆరు ఆశ్వాసాల గ్రంథంగా వ్రాసినాడు. అయితే. ఎర్రనను అనుకరించాడని చెప్పే వీలు లేదు. ఎర్రన హరివంశానికి పీఠిక ఉంటే, ఉత్తర హరివంశానికి లేదు. ఎర్రనకు విషయ ప్రధానమైన భావగతి మీద, వర్ణనల మీద, రస నిర్వహణ మీద ప్రధాన దృష్టి ఉంటే, సోమన తెలుగు కవితను పురాణ మార్గం నుండి మళ్లించాలని ప్రయత్నించాడు. సఫలీకృతుడైనాడు. ఎర్రన “బుషి గా కావ్యం రాస్తే, సోమన “కవిగానే కావ్యం రాశాడు. ఎర్రన హరివంశ అనుకరణలు ఉత్తర హరివంశంలో కానరావు.

సంస్కృతంలోని పద్దెనిమిది పురాణాల్లో నృసింహపురాణం లేదు. ఎర్రన రాసిన నృసింహపురాణం “పురాణం” కాదని స్పష్టమవుతున్నది. ఎర్రన తాత ఎజపోతసూరి శ్రీమహోబలీశ నరసింహుని భక్తుడు. తన దైవంపై తీర్థ మహత్మాాన్ని అవతార వైశిష్ట్యాన్ని రాయమని కోరగా ఎర్రన నృసింహపురాణం రాశాడని యశోదారెడ్డి అభిప్రాయపడింది. కథా ప్రారంభంలో “ఏను విన్నపంబు సేయంగల లక్ష్మీ నరసింహావతారంబను పురాణకథకు బ్రారంభం బెట్టిదనిన” అని. పేర్కొన్నాడు. అసలీ గ్రంథం. పేరు “లక్ష్మీ నరసింహావతార కథ”. చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో “నారసింహుని పురాణ మొనర్చె హరి మెచ్చి నన్నునెన్నడు చూచినాడు వనగ” అని రాసిన వాక్యాలను బట్టి “నృసింహపురాణం'” అనే తెలుస్తున్నది. ఇది అనువాదం కాదు. క్షేత్రమహత్మ్యం గురించి చెప్పబడిన స్వతంత్ర కావ్యం. పురాణానికి ఉండవలసిన సర్గ ప్రతిసర్గాది పంచలక్షణాలు ఇందులో లేవు. కొంతవరకు బ్రహ్మాండ పురాణంతో సంబంధం ఉన్నది. విష్ణుపురాణంలో కనిపించే కథాసరళి తనకు అనుగుణంగా మలచుకొని ఉపయోగించుకున్నాడు. భాగవతంలోని నృసింహావతార కథా భాగాన్ని కాక, వామన ప్రాదుర్భావానికి తరువాత చెప్పిన కథా భాగాన్ని స్వీకరించినాడు. నృసింహ పురాణంలో ఎర్రన హిరణ్యకశిపుని దిగ్విజయాన్ని వర్ణించిన విధానం హరివంశంలోని కాలనేమ్యాదుల దిగ్విజయ వర్ణనా విధానాన్ని తలపింపజేస్తున్నదని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

ఎర్రన శ్రీమద్భాగవత తృతీయ స్కంధంలోని _ వైకుంఠపుర _ వర్ణనను నృసింహపురాణంలో అనువదించాడు. “నారాయణుని దివ్య నామ సంక్షీర్తనంబని శంబు జేయు మహాత్ములకును బద్మాక్షు శ్రీపాద పద్మంబులత్యంత భ క్రితో బూజించు ప్రాజ్ఞులకును” అన్ని రకాల సుఖాలను నారాయణుడు ప్రసాదిస్తాడని అనువదించాడు. వైకుంఠపుర వర్ణనను జేస్తూ వివరిస్తాడు ఎర్రన. కొన్నిచోట్ల విష్ణుపురాణంలోని హిరణ్యకశిపు ప్రహ్లాదుల సంవాదాన్ని యధాతథంగా వర్ణించాడు.

ఎర్రన రచనలన్నింటిలోను జాతీయాలు, అలంకారాలు సహజ సుందరంగా సందర్భోవితంగా రాశాడు. ఎర్రన నృసింహపురాణంలో భాగవత శ్లోకాలను సంక్షేపించినట్లు, విష్ణుపురాణ శ్లోకాలను యధాతథంగా అనువదించినట్టు, కావ్యకళావైభవాన్ని _ ప్రదర్శించినాడు. కొన్నిచోట్ల హరివంశ పద్యాలను విపులీకరించాడు. మూలంలోని సూచన ఆధారంగా విస్త్పతంగా రాస్తూనే నాచనసోముని అనుకరించినట్లుగా యశోదారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎర్రన కాలం నాటికే అనువాదాలు అనేకం వచ్చాయి. కాబట్టి ఎర్రన రెండు భాషల్లోనూ ప్రావీణ్యం పొంది అనువాదం చేయడం సులభమైంది. దానికి తోడు రాజపోషణ వల్ల కూడ తెలుగు భాష స్థిర రూపాన్ని పొందింది. నన్నయ, తిక్కన అనువాదంలో మూలానికి విపులీకరణ, సంక్షేపము, విషయ పరిహరణం, వ్యత్యయం ఈ నాలుగు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎర్రన అనువాదంలో యథామూలకథ ఉన్నాకూడ ఆయా సందర్భాలను బట్టి వివిధ కావ్యాల్లోని సారాంశాలను ఒక సందర్భోచిత కావ్యంగా మలచడం హరివంశ, నృసింహపురాణంలో కనిపించిందదే. సందర్భోచితంగా కథాపాత్రల పేర్లను కూడ ఎర్రన మార్చినాడు. అనేక సందర్భాల్లో ఇతర గ్రంథాల నుండి సేకరించిన శ్లోకభావాలను తన గ్రంథంలో చేర్చుకోవడమనే విశేష రచనా విధానానికి శ్రీనాథునకు ఎర్రనయే మార్గదర్శకుడై ఉండవచ్చని యశోదారెడ్డి అభిప్రాయం.

వ్యక్తి, వస్తు, క్షేత్రాది బాహ్యవర్గనతో తృప్తి పొందక మనోవృత్తులను, భావవైఖరులను విపులీకరించి పాఠకులకు ఆసక్తి కలిగించుటకు మధ్యలో సంభాషణలను. పెట్టాడు. భారతారణ్య _ పర్వశేషంలో అనువాదంలోని “మూలాసరణమును”, హరివంశంలో కొంత “స్వేచ్చను” పాటించి ఇతర గ్రంథాలనుండి ఆయా కథావృత్తాంతాలను తీసుకున్నాడు. నృసింహపురాణంలో కథాక్రమమును పాటించక ఇష్టంవచ్చినట్లు కథాసూత్రంను తనే ఏర్పాటు చేసుకున్నాడు. సోమన రచన స్వతంత్ర రచన. అందుకే సోమన అనువాదం “మూలాతిరిక్తమైన స్వేచ్భానువాదమనీ” చెప్పవచ్చని తన పరిశోధన ద్వారా ధృవీకరించింది యశోదారెడ్డి. ఎర్రన అనువాదం అట్టకాదు. మూలాధారం లేక ఏ విషయాన్ని వ్రాయలేదు. “ఒక ఆలంబనమును పురస్కరించుకొని దానిని మెరుగులు దిద్ది తనది కావించుకొనుట ఎర్రన అనువాద విధానం”. ఇతని దృష్టి ఎపుడూ ఒకరిని అనుకరించి, అనుసరించి వాళ్ళను మించి రచన చేయగల దక్షత తనకు కలదని లోకానికి చాటడమే ఎర్రన అనువాద విధానమని యశోదారెడ్డి స్థిరమైన అభిప్రాయం. అందుకే ఎర్రన అనువాద పద్ధతి “మూలాతిరిక్తమయ్యు మూలానుసారి” అని చెప్పవచ్చును.

సకల భాషాకవిత్వవేది, బహుపురాణ కథా సకల సంవేదియైన ఇతనిని లోకం కవిత్రయం అన్నందున ఎర్రన _ అదృష్టవంతుడని అంటుంది యశోదారెడ్డి. రాజపోషణ వల్ల, లిఖిత గ్రంథప్రాచుర్యం వల్ల తెలుగు భాష విస్తరించింది. దానికి ఇంపులు సొంపులు కూర్చినవాడు ఎర్రన. “Personality is what is a Unique in Man” అని పాశ్చాత్య సాహిత్యవేత్తలన్నారు. అదే వ్యక్తిని వ్యక్తి నుండి వేరు చేసి ప్రత్యేకించేది. ఇది ఎర్రనలో సహజ సుందరంగా కనిపించింది.

కథాసంవిధానములో విచిత్ర పద ప్రయోగ వైచిత్ర్యములో, శబ్దార్ధాల మేలుకలయికలో నాచనసోమన _ అనుకరించాడు. నన్నయ, _ తిక్కన, నాచనసోమనలను ఎర్రన ఆదర్శంగా తీసుకుంటే ఆ తరువాత శ్రీనాథుని మొదలు కవులంతా ఎర్రననే అనుకరించారు. శ్రీనాథుడు “పరిఢ వింతం ‘బ్రబంధ పరమేశ్వరునిలేవ సూక్తి వైచిత్రి నొక్కొక్కమాట”” అని ఎర్రనను అతిగా సంభావించినాడు. ఎర్రన స్వభావోక్తి అలంకారాన్ని ఎక్కువగా ఉపయోగించాడు. సూక్తి వైచిత్రాన్ని ప్రదర్శించాడు.

ఎర్రన సకలకళా రహస్యాలను తెలిసిన కవి మాత్రమే కాదు. సంగీత సాహిత్య పోషకుడైన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండడం వల్ల, ఆయా సందర్భాన్ని బట్టి తాను చూసిన ఆ కళల్లో ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే ఎర్రన కావ్యాల్లో గానకళా ప్రసంగాలు కన్పిస్తాయి. ఉదాహరణకు నృసింహపురాణంలో అప్పరసల విభ్రమవ్యాపారాలను చెప్పు సందర్భం. హరివంశంలో వాద్యసంగీతము, నాట్యం గురించి చెప్పాడు. ఎర్రన ఎక్కువగా “విజ్ఞానము” అనే శబ్దాన్ని వాడినాడు. విజ్ఞానమంటే పరతత్త్వవిద్య, బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము. వీటిని ఉపయోగించే కవిత్వం వ్రాశాడు. గోపికల విరహం, పరమ పవిత్రమైన భక్తి పరిమళింపజేసి మధుర భక్తి విధానానికి దారితీసినవాడు ఎర్రనయే అని యశోదారెడ్డి అభిప్రాయపడింది.

ఎర్రనకు “యోగం” అంటే అభిమానం ఎక్కువ. శృంగారిని మహాయోగిగా అభివర్ణించిన యోగి ఎర్రన. నమ్మకాలు, ఆచారాలు ఎర్రన కావ్యాల్లో ఉన్నాయి. శివములు, పూనికలు, ఆనాటి సహజ సాంఘిక పరిస్థితులను తెలుపుచున్నాయి. నేటి టమంయఇ6? కన్న ఉత్తమలక్షణం నాటి రాజులకుందని, ప్రజారంజనమే ప్రభువు ప్రథమ ధర్మమన్నట్లు నాటి రాజు చూసినారని ఎర్రన కవిత్వంలో రాజనీతికి సంబంధించిన పద్యాలు ఉన్నాయని యశోదారెడ్డి నిరూపించినారు.

కొత్త సమాచార సేకరణ (New Findings) :

ఎర్రన ఉత్పల, చంపకమాలలే కాక, మత్తకోకిల, క్రాంచపదము, మందాక్రాంతం, మాలిని, స్రగ్ధర, తోటకము, కందము తదితర వృతాలను ఉపయోగించాడని యశోదారెడ్డి అభిప్రాయం. లాళ, శాస, దాధ, ఖండాఖండ బిందు ప్రాసలు ఎక్కువగా వాడినాడు. టకారా-డకారల ప్రయోగం, బహువచనంపై బహువచన ప్రయోగాలు, ఇకార సంధులు, ప్రత్యయాలు, సందర్భోచిత పద ప్రయోగాలు, చమత్కారాలు ఎర్రన కవిత్వంలో ఉన్నాయని శబ్దరత్నాకరములోనూ ఈ పద ప్రయోగాలకు అర్ధాలు లేవని యశోదారెడ్డి పరిశోధనలో తేలింది.

పద్నాలుగవ శతాబ్దంలో ఉన్న కవుల కవిత్వమే ఆ తరువాతి కవుల కవిత్వానికి ఆదర్శప్రాయమైంది. ప్రాచీన సమ్మతమైన వేదవ్యాసముని ప్రతిపాదితమైన, హరిహరభేద తత్వమును తిక్కన, ఎర్రన, నాచనసోమన ప్రబోధించగా, పోతన ప్రధాన తత్త్వంగా స్వీకరించి భాగవతంలో పరిపూర్ణత సాధించాడు.

ముగింపు (Conclusion) :

అనువాద సందర్భాల్లో నన్నయ, తిక్కన, నాచనసోమనాథుల కన్న కొంత భిన్నంగా, విశిష్టమైన ఎర్రన అనువాద విధానంతో ప్రభావితుడైనవాడు శ్రీనాథుడు. ఎర్రన సూక్తి వైచిత్రియే శ్రీనాథునికి ప్రశంసలను తెచ్చిపెట్టింది. నన్న్మయ ధారాశుద్ధి, తిక్కన తెలుగు తీయదనము, తన సహజ పరిశీలనాదృష్టితో మేళవించి ఒక కొత్త వికాసంతో పద్యాలను అల్లినవాడు ఎర్రన అని స్థిరమైన అభిప్రాయాన్ని యశోదారెడ్డి వెలువరించింది.

ఉపయుక్త గ్రంథాలు (Referral Books) :

  1. డా॥ పి. యశోదారెడ్డి – ఎజ్జ్టాపైగడ — యుజిసి గ్రాంట్సు కమీషన్‌ సహాయంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురణ – 1972.
  2. ఆచార్య వి. రామచంద్ర – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ప్రచురణ – 2006.
  3. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము — తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ — తిరుపతి – 2011.
  4. పింగళి లక్ష్మీకాంతం – ఆంధ్ర సాహిత్య చరిత్ర – గంగాధర పబ్లికేషన్స్‌, విజయవాడ — 1985.
  5. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి – ఆరు యుగాల ఆంధ్ర కవిత – ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు — 1986.



5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles