20.1 C
New York
Monday, April 29, 2024

పిపీలికం

కీ. శే. రావిశాస్త్రి

పూర్వం కృతయుగంలో, ఒకానొక ప్రజాపతి రాజ్యం చేసే కాలంలో, గౌతమీ నదికి ఉత్తరంగా శ్యామవనం అనే అడవిలో ఓ పెద్ద మర్రిచెట్టొకటి ఉండేదిట. ఆ మర్రిచెట్టు కింద, దాని మానుని ఆనుకొని ఓ పెద్ద చీమలపుట్ట ఉండేదిట. అందులో ఒకానొక చీమకి ఒకనాడు ఉన్నట్టుండి తనేవరో ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిందట.

తనెవరో అనే విషయం గురించి ఆ చీమ చాలా తీవ్రంగా ఆలోచించనారంభించిందట. (ఆలోచించి పనిచెయ్యడం మంచిదే ? కాని, ఆలోచన ఒకప్పుడు పనికి అంతరాయం కలిగిస్తుంది) పనీ పాటూ సరిగా చెయ్యకుండా చీమ ఆలోచనల్లో పడి కూర్చుండిపోయేసరికి తోటి చీమలు దానిని చీవాట్లు పెట్టేయట. పనిచెయ్యని ప్రాణులు “చెడిపోతాయిస్మా !” అని అవి దాన్ని హెచ్చరించేయిట. అయినప్పటికీ దాని ఆలోచనలది మానింది కాదట.

నేనెవర్ని? కళ్ళనా, కాళ్ళనా, తలనా, మొండేన్నా? ఎవరు నేను? నేను తినే తిండినా నేను? నా ఆలోచించే శక్తినా నేను? ఎవర్ని నేను? ఎందుకు పుట్టేన్నేను? ఎందుకు జీవిస్తున్నాన్నేను? ఎందుకు వస్తాను? చచ్చి నేనేమవుతాను? ఎవర్ని, నేనెవర్ని?

ఇటువంటి ఆలోచనలతో చీమకి నిద్ర చెడిందట. ఆరోగ్యం క్షీణించిందట. తల కూడా చీమవాసంత పాడయిందట, ఆరోగ్యం క్షీణించి, ఆలోచనలు ఎక్కువ వడంతో దాని పరిస్థితి చాలా గందరగోళంగా మారిందట.

అప్పుడు, ఆ చిరుబీమ దురవస్థ చూసి, దానికి మరొక చీమ హితబోధ చేసిందట : “ఒరే సోదరా అంతుచిక్కని ఆలోచనలతో ఎందుకలా తల బద్దలు కొట్టుకుంటావు? అలా చేసుకొనేదానికి మారుగా అనుభవశాలినెవరినైనా అడిగి చూడకూడదా? నే చెప్పేమాట విను. ఇక్కడికి మూడు
ఆమడల దూరంలో గోపన్నపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ నిగమశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. నీ ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానం చెప్పగలడేమో వెళ్ళి అడుగు! అలా చెయ్యి !” అని హితబోధ చేసిందిట సోదర పిపీలికం.

ఆ హితబోధ విని ఆనందించిన మన చిరుచీమ, పని కట్టుకొని, పెను ప్రయాసలకోర్చి ప్రయాణంచేసి, గోపన్నపాలెం చేరుకొని, నిగమశర్మ ఇంటికి వెళ్ళిందట.

ఆత్మపదార్దానికైనా సరే, బ్రహ్మపదార్థానికైనాసరే ఆకలిమాత్రం తప్పదని గోపన్నపాలెపు నిగమశర్మకి బాగా తెలుసునట. మన చిరు చీమ అతని ఇల్లు చేరుకునే సమయానికి అతడు గొప్ప ఆకలి మీద ఉన్నాడట. మన చీమ అతడివైపు జ్ఞానకాంక్షతో చూస్తే, అతడు మన చీమని ఆకలి చూపు చూసేడట. కాని,నిగమశర్మ సర్వభక్షకుడు కాదట, అతడు చీమలని కాని, మానవులను కాని తినడట. (వారి కష్టాన్నే తినగలడట).

చీమని చికాకుగా చూసి – “ఏమిరా పిల్లవాడా! ఎందుకొచ్చేవు? నీకు నాతో ఏమి పనుంది?” అని ప్రశ్నించేట్ట నిగమశర్మ.

అప్పుడు ఆ చీమ ముందుకాళ్ళు వంచి, తల నేలకి ఆన్చి, “స్వామీ !

నేనెవర్ని? ఎందుకు పుట్టేను? ఎందుకు బతుకుతున్నాను? ఎందుకు వస్తాను?” అని సవినయంగా ప్రశ్నించి తన రాకకి కారణం నిగమశర్మకి తెలియజేసిందట.

గోపన్నపాలెపు గోపకుమారుల్లో కొంతమందికి విద్యాభ్యాసం చేయాలనే వాంఛ కలిగినప్పుడు “ఆలమందలు కాసుకొనేవాళ్ళకి ఓనమాలెందుకురా!” అని వారిని నిగమశర్మ లోగడ నిరుత్సాహపరిచేడుట. అందుచేత వారు ఓననామాలవంక రావడం మానివేసేరట. ఆ గ్రామంలో క్షత్రియులెవరూ
లేదు. ఒక వైశ్యుడున్నాడట! కాని, అతనికి లాభాల చదువే కాని ఓనమాల చదువు అక్కరలేకపోయిందట. మరింక బ్రాహ్మణులున్నారా అంటే; ఆ గ్రామానికి నిగమశర్మే ఒంటి బ్రాహ్మణుడుట, దానా దీనా, నలుగురికి నాలుగేసి అక్షరాలు ఏం చెయ్యాలో చెప్పి నాలుగు నూకలు సంపాదించే అవకాశం నిగమశర్మకీ లేకపోయిందిట. ఇంటికి మూడేసి నూకలు చొప్పున ముష్టైత్తుకుంటూ, సగం ఆకలితో బతికే అని అమాయకంగా నిగమశర్మకి జ్ఞాన కాంక్షతో వచ్చిన చిరుచీమని చూడగానే బండెడాస, కొండంత ఉత్సాహమూ కలిగేయట, “మానవేతర జీవుల్లో జాతి భేదప్రమేయం లేదు కాబట్టి” ఈ చీమకి చదువు చెప్పి నాలుగు నూకలు లాగొచ్చుకదా అని అతను చాలా సంబరపడ్డాట్ట.

చీమ మాటలు విన్నాక నిగమశర్మ క్షణం సేపు ఆలోచించి గొంతుక సవరించుకొని, “అబ్బో! మంచి జిజ్ఞాసతోనే వచ్చేవే ! కాని చూడు, నువ్వు తెలుసుకోవాలనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే చాలా చదువుకోవాలే!” అన్నాడట.

“అలాగైతే స్వామీ, ఆ చదువు నాకు మీరే చెప్పాలి !” అందిట చిరుచీమ.

“అలాగే చెప్తాను. కాని, ఒక యదార్ధం ఉంది. ఆకలితో మాడి చచ్చేవాడు ఆ పరమాత్యుడైనా సరే ఎవరికీ పాఠాలు చెప్పలేడు. వాడికి ఆ శక్తికాని, ఆ ఇచ్చకాని ఉండవు. నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను” అని చెప్పి ఊరుకున్నాడు నిగమశర్మ.

చిరుచీమకి ఏం చెయ్యాలో తెలియక

“మరైతే నేనేం చేయాలి స్వామీ?” అని అమాయకంగా అడిగిందట.

అందుకు సమాధానంగా, “ప్రతి దినం నాకు గిద్దెడు నూకలియ్యి అంతేచాలు! అందుకు సమ్మతిస్తివా నేన్నీకు చెప్పగలను చదువు” అని అశని గాంభీర్యం వెనక దాచి తన యదార్థపు కోరిక తెలియజేసేడట చీమకి శర్మ.

అప్పుడా చిరు చీమ తెగ సంతోషించి నిగమశర్మకి నమస్కరించి “స్వామీ! ఎంతటి కష్టమైనా సరే నేను లెక్కచెయ్యను. నాకు చదువు కావాలి !” అని తన అభీష్టం గ్రహించి, ఆ క్షణం నుంచీ ఎద్దులా కష్టపడి గింజ గింజ చొప్పున గిద్దెడు గింజలూ ప్రతిదినం గురువుకి సమర్పించి అతని దగ్గర చదువులు కొన్ని నేర్చుకుందిట.

నిగమశర్మ ఆ చీమకి అక్షరమాలంతా నేర్చేడట. గుణింతాలన్నీ ముప్పేదట. దానిచేత “తల, వల” అన్నీ చదివించేదట. దానికి అంకెలన్నీ చూపించి, కూడికలూ, కొట్టివేతలూ చెప్పేడట, అంతకంటే ఎక్కువ చదువులు అతనికి రావట. అందుచేత తను చెప్పగలిగిన మేరకి వీలైనంత ఆలస్యంగా చదువులన్నీ చెప్పి చివరి దినం చీమని పిలిచి,

“నువ్వెవరవో నీకిప్పుడు తెలిసిందా?” అని అడిగేడట నిగమశర్మ.

“నేనెవరిని స్వామీ! వేగిరం చెప్పండి స్వామీ!” అని ఎంతో కుతూహలంగా తొందర తొందరగా అడిగిందట చిరుచీమ.

అప్పుడు నిగమశర్మ పరబ్రహ్మంలా నవ్వి, “మరెవరివీ కావు! నువ్వు చీమవి !” అన్నాట్ట.

“ఆహా! నేను చీమనా!” అని ఆశ్చర్యచకితురాలైపోయి, ఆ తరువాత పరమానందభరితురాలై పోయిందట చిరుచీమ.

“మరింక చదువై పోయింది. నువ్వు వెళ్ళవచ్చు” అని నిట్టూర్చి అన్నాడట.

చీమ జ్ఞానం సంపాదించిన చిరుచీమ కృతజ్ఞతాపూర్వకంగా మరొక నాలుగు దినాల నూకలు నిగమశర్మకి కట్నం కింద సమర్పించుకొని, ఎగురుతూ, గెంతుతూ, శ్యామవనం వెళ్ళి తన సోదరులందరికీ జ్ఞానం పంచిందట. ఆ చీమలన్నీ కూడా “ఆహా! అయితే, మనమంతా చీమలన్నమాట!”
అని సంబరపడి చీమలు పండుగ జరుపుకున్నాయట.

అయితే –

మన చీమ సంతోషంగా శ్యామవనం చేరుకొని పుట్టినింటికి వెళ్ళిందేకాని దానికి ఆ సంతోషం ఎక్కువ దినాలుండలేదట. దానికి అనుమానాలన్నీ మళ్ళీ పుట్టుకు రాసాగేయట.

“చీమంటే ఏమిటి? కళ్ళా. కాళ్ళా, తలా, మొండెమా ? కాళ్ళు లేకపోతే నేను చీమని కానా? కళ్ళు లేకపోతే నేను చీమ కంటె భిన్న మవుదునా? చీమ అనే ఈ పదార్ధం ఎందులో వుంది? ఇది ఇలాగే
ఎందుకు పుట్టాలి? ఇది ఇలాగే ఎందుకు బతకాలి? ఈలాగే ఎందుకు చావాలి?”

ఇటువంటి చిక్కు ప్రశ్నలన్నీ ఆ చీమని తిరిగి చీకాకు పెట్టసాగేయట, దాని ఆరోగ్యం మళ్ళీ పాడవ నారంభించిందట. ఈ పెను ప్రశ్నలన్నీ నేను చీమని అనే చిరుజ్ఞానంతో విడవవని తెలుసుకొని, అది తిరిగి పాత గురుశర్మ దగ్గరకి పరుగెట్టుకుంటూ వెళ్ళి తన సందేహాలన్నీ నివృత్తి చేయమని పాదం పట్టుకొని ప్రార్ధించిందట.

“ఆ జ్ఞానమే నాకుంటే అరసోలడు నూకలకి నీ అన్ని సందేహాలు తీర్చేయనా!” అని లోలోపల అనుకున్నాడట ఆకలితో ఉన్న నిగమశర్మ, ప్రకాశంగా చీమతో- “నీ సందేహ నివృత్తి నేను చెయ్యలేను” అన్నాడట.

“పోనీ ! చేసే జ్ఞానిని చూపించండి స్వామీ!” అని బతిమాలిందట చిరుచీమ.

అందుమీదట, తనకి తెలిసిన జ్ఞానులు గురించి ఆలోచించి

“శిష్యుడా! నీ సందేహాలకు సమాధానాలు చెప్పగలిగే మహానుభావుడు నాకొక్కడే కనిపిస్తున్నాడు. ఇక్కడికి మూడు అనుడల దూరంలో జన్నాలపల్లె అనే అగ్రహారం ఒకటుంది. ఆ అగ్రహారంలో చతుర్వేది అనే సద్ర్రాహ్మణుడున్నాడు. నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళమీద పడి, జ్ఞానభిక్ష పెట్టమని ఆయన్ని ప్రార్ధించు” అని చెప్పేడట నిగమశర్మ. ఆ చతుర్వేదికి చీమ విషయాలన్నీ తెలియజేస్తూ ఓ తాటాకు మీద జాబు కూడా రాసేడట శర్మ.

ఆ తాటాకు ఈడ్చుకుంటూ, కొన్ని దినాలు కాలినడకన ప్రయాణం చేసి జన్నాలపల్లె చేరుకొందిట చీమ.

నిగమశర్మ చెప్పినట్టుగానే జన్నాలపల్లెలో “చతుర్వేది” అని పిలువబడే వేదవేదాంగవేద్యుడు తప్పక ఉన్నాడట. కాని, చీమ వెళ్ళే సమయానికి ఆయన వేదపారాయణంలో ఉన్నాడట. ఆ పిమ్మట ఆయన శిష్యులచే పరివేష్టించబడి ఉన్నాడట. పరమగురువు దరికి పరదేశివీమ చేరకుండా వారి సచ్చిష్యులంతా చాలా తంటాలు పడ్డారట. యమ ప్రయాసలకి ఓర్చి మన చీమ ఆ చతుర్వేదిని కలుసుకొని
నిగమశర్మ నుంచి తెచ్చిన పరిచయ పత్రం ఆయనకి చూపించగలిగేసరికి దానికి తలప్రాణం తోకకి వచ్చిందట.

తాటాకు చదివి చిరుచీమని చూసి చతుర్వేది గారు స్మిత వదనులయేరట. “అయితే, వేదాలన్నీ తెలుసుకోవాలనుందా నీకు?” అని చీమని వారు పృచ్చించేరట. “తమరు అనుగ్రహిస్తే తెలుసుకోగలను” అందిట సవినయపు చీమ.

“నాలో ఏమీలేదు నాయనా! అంతా భగవదనుగ్రహం!” అన్నారట చతుర్వేదిగారు.

“వేదాలు తెలుసుకొందికి భగవదనుగ్రహం ఉండాలంటే అది బ్రాహ్మణపు చీమ అయివుండవలెను కదా?” అని అంతలో చతుర్వేది గారి శిష్యుడొకడు ఒక చిన్న సందేహరూపంలో తన అభ్యంతరం తెలియజేశాడట. ఆ విషయం గురించి కొంత చర్చ జరగవలసిందేకాని చతుర్వేది గారు వేదాలు తెలిసిన అధికారంతో చర్చ జరగనీయకుండా చేసేరట.

“సద్బుద్ది కలవాడే సబ్రాహ్మణుడు, పుట్టు బ్రాహ్మణులు వచ్చేటి కాలం కలికాలంకాని ఈ కాలం కాదు. ఈ చీమకి? సద్బుద్ధి కలదనినా బుద్ధికి తోస్తోంది. చిన్న చిన్న చిరు పాపాలేవయినా ఈ చీమ చేసి ‘పున్నప్పటికీ, శుద్ధీచేసి ఈ చీమని మనం బ్రాహ్మణ్యంలోకి మార్చుకోవచ్చును” అన్నారట చత్తర్వేదిగారు.

శిష్యులంతా గురువాక్యం శిరసావహించవలసి వచ్చిందట! కాని వారు తమ కోపాల్ని తమతమ కడుపుల్లో దాచుకొని, చీమకి వాతలు పెట్టి శుద్ధి చేద్దామని సంకల్పించేసరికి, “వాతలు పెట్టినట్లయితే ఎందుకు చస్తానో తెలుసుకోకుండానే చస్తాను మొర్రో” మని చిరుచీమ పెనుకేకలు వేసి, గోల చేసిందిట. కేకలు విని పరుగిడి వచ్చిన రెప చతుర్వేది గారు శిష్యుల్ని వారించి, వాతలకి మారుగా మంత్రజలం జల్లి, ఆ
చీమని శుద్ధిచేసి దానికి బ్రాహ్మణ్యం ఇప్పించేరట.

చతుర్వేదిగారు నిర్దిష్టంగా గురుకట్నం నిర్ణయించే అలవాటు ఎన్నడూ చేసుకోలేదటగాని, వారు యజ్ఞం చేయదలచుకున్నారట. హిరణ్యం కొంతైనా లేనిదే యజ్ఞం జరగడం కష్టంట, అందుచేత చీముడి వేదాలూ, వాటి సారాలూ, తెలియజేసేముందు చతుర్వేది గారు ఓ చిన్న నిబంధన చేసేరట.

ఆ నిబంధన ఏమిటో వినిన చీమ “అయ్యా! బంగారపు బరువు నేనే భరించలేనే! తాటాకే మొయ్యలేకపోయేను కదా !” అందిట.

“రేణువు రేణువు చొప్పున ఎంత తేగలిగితే అంతే తే! చాలు!” అని చాలా సౌమ్యంగా సెలవిచ్చేదట చతుర్వేదిగారు.

రేణువు రేణువు చొప్పున తేగలిగినంత హిరణ్యం తెచ్చుకొన్న చీమ సంవత్సరాలపాటు శ్రమించి, చతుర్వేది గారి వల్ల వేద వేదాంగాలన్నీ తెలుసుకొని ధన్యుడయేననుకుందట మన చిరు చీమ.

అధ్యయనం అంతా అయిన పిమ్మట చతుర్వేది గారి వల్ల వేదసారం అంతా ఒకే ఒక మాటలో ఉన్నదని తెలుసుకున్నదట మన చీమ.

ఏమిటది?

“సోహం!” అన్నారట చతుర్వేదిగారు.

“సోహం” అందిట చిరుచీమ, అన్నాక –

“అంటే ఏమిటి స్వామీ!” అని అడిగిందట చీమ,

అంటే ఏమిటో అంతా బోధించేరట చతుర్వేదిగారు. అంటే ఏమిటో అంతా విన్నాక

“అయితే ఏమిటి?” అని ప్రశ్నించిందిట పిపీలికం.

చదువైపోయిందన్నారట చతుర్వేదిగారు.

శ్యామవనం చేరుకొందిట పిపీలికం.

బ్రహ్మజ్ఞానం పొందినప్పటికీ బ్రతుకులో ఏం తేడా కూడా కనిపించకపోయేసరికి చీమ చాలా నిరుత్సాహపడిపోయిందట. బ్రహ్మజ్ఞానంతో దాని తలంతా నిండిపోయి దాదాపు పండిపోయినప్పటికి కూడా బతుకులో దానికి వెతుకులాటలూ, పీకులాటలూ, బరువులూ, బాధ్యతలూ, కష్టాలూ,
కడగళ్ళూ ఏమి తప్పలేదుట! బ్రహ్మజ్ఞానం పొందికూడా నీరసించిపోతున్న మన చీమని చూసి మరొక చీమ చాలా వగచి ఈ విధంగా హితవు చెప్పిందట.

“నువ్వెందుకు తమ్ముడా, అలా నీరసించిపోతావు. వేదవేద్యుల కంటే గొప్పవారు. మహా బుషులని పిలువబడేవారున్నారని విన్నాను. మన ఈ వనంలోనే ఏడు కొండల అవతలనుంచి వచ్చిన సోదరుణ్ణి ఒకణ్ణి ఈ మధ్యనే నేను కలియడం తటస్థించింది. వాళ్ళు ఉన్న దగ్గర ఒక మహాబుషి ఎన్నాళ్ళనుంచో తపస్సు చేస్తున్నాడట. ఆ మహాబుషి చుట్టూనే వాళ్ళంతా పుట్ట పెట్టుకుని జీవిస్తున్నారట. పోయి నీ బాధంతా ఆ మహానుభావునితో చెప్పుకోకూడదా!” అని హితబోధ చేసిందట ఆ మరొక చీమ.

హితవు చెప్పినందుకు ఆ మరొక చీమకి నమస్కరించి బుషిపుంగవుణ్ణ్జి వెతుక్కుంటూ ఏడుకొండలు దాటి వెళ్ళిందట మన చీమ.

అక్కడ ఒక చిన్న గుట్టంత పుట్ట వుందిట. అందులో చీమ లెన్నెన్నో వున్నాయిట. ఆ పుట్టలోనే మహాబుషి ఉన్నారని తెలుసుకొని ఆ పుట్ట అధికారులైన చీమల అనుమతి పొంది అందులోనికి ప్రవేశించి, అక్కడ మట్టితో, జటలతో, చీమలతో నిండిపోయినప్పటికీ నిశ్చింతగా తపస్సు
చేసుకొంటున్న ఆ తాపసోత్తములవారిని కళ్ళారా చూచి ఆ మహానుభావునికి వినయాతివినయంగా వంగి నమస్కరించి పేరని మృదువుగా, వినయంగా సంస్కృత శబ్దాలతో పిలిచిందిట మన చీమ.

చీమల పుట్టలో దేవభాష వినబడగానే బుషిపుంగవులవారు ఉలిక్కిపడి కళ్ళుతెరచి మన చీమని గుర్తించి, “నీకు ఏమి కావలెను నాయనా?” అని దాన్ని శాంతంగా అడిగేరట. వెదురు బొంగులోంచి గాలి వచ్చినట్టుగా గంభీరంగా ఉన్నదట వారి స్వరం.

చీమ అప్పుడు తన విషయం అంతా వారితో వివరంగా చెప్పుకున్నదట. నాలో నిజంగా భగవత్పదార్ధం ఉన్నదా? ఉంటే భగవంతుడికంటే భిన్నమేరీతిగా అయేను? నాలో భగవంతుడు లేక పోయినట్లయితే భగవంతుడు సర్వవ్యాపకుడు కానట్టే కదా! అందుచేత అతడు నాలో ఉన్నట్టే లెక్క చేసుకోవాలి. కదా! అతను నాలో ఉన్నప్పటికీ నేను ఇన్ని బాధలేల పడవలెను? అది నా పాపకర్మల ఫలితమనుకొన్నచో భగవంతుడు నాలో ఉండగా, ఆ పాపములు నేను చేయుటెట్లు సంభవించినది? భగవంతుడు కూడా పాపమునుండి తప్పించు కొనలేదా? ఇంతకీ నేనెవర్ని? నేనీ రీతిగా ఎందుకుండిపోయాను? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అంతా నాకు తెలియజెప్పండి స్వామీ! అందిట చీమ.

చీమ వాక్కులు శ్రద్ధగా విన్న బుషిసత్తములు శాంతంగా ఈ విధంగా సెలవిచ్చేనట!

“బ్రహ్మజ్ఞానం విని విని సాధించేనంటే లాభంలేదు చీమా! “సోహం” అనేది అందరికి తెలుసు, దాన్ని ఆచరణలో సాధించి అనుభవం పొందాలంటే యోగంలోనే సాధ్యపడుతుంది. అందుచేత యోగసాధన చేసి తపస్సుచేయి” అని సెలవిచ్చేరట.

వారు అలా సెలవిచ్చినందుకు వారికి నమస్కరించి, “తపస్సు చేస్తే జరిగేదేమిటి స్వామీ?” అని ప్రశ్నించిందట చిరుచీమ.

“జన్మరాహిత్యం సంపాదించి మోక్షం పొందడమే ఏ జీవికైనా గమ్యం! తపస్సు వల్ల అది సిద్ధిస్తుంది” అన్నారట బుషిపుంగవులు.

చిరుచీమ ఒక క్షణం అలా నిలబడి, “ఇంతకీ స్వామీ! ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు! మోక్షం ఎందుకు? తెలియక అడుగుతున్నందుకు క్షమించండి” అన్నదట

చీమ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మౌనముద్రాంకితులయేరట బుషిపుంగవులు. మోక్షం ఎందుకు అంటే ఎవరైనా ఏమీ చెప్పగలరు? (అలా అడిగేవారితో భాషించి ఏమి ప్రయోజనము)

మునీశ్వరులవారి వడ్ద కొంతసేపు నిశ్చలంగా నిలబడిందట మన చీమ. వారు సమాధానం చెప్పరని నిశ్చయమయేక చీమ తన ఇంటికి తిరుగుముఖం పట్టిందట. రాళ్ళూ రప్పలూ, చెట్లూ చేమలూ, ఏడు కొండలూ, ఎన్నెన్నో గుట్టలూ అన్నిటికీ దాటుకొని చిరుచీమ తన పుట్ట సమీపానికి చేరుకొనేసరికి దాదాపు నెల దినాలు పట్టింది. వెళ్ళేసరికి భానూదయం అవుతోందిట.

మర్రిచెట్టుక్రింద తన పుట్ట అల్లంత దూరంలో ఉంది. ఉండగా అక్కడ నిలబడి పోయిందిట చిరుచీమ, పుట్టలోంచి చిందరవందరగా పగిలిపోయిన కోటలోంచి చెదిరిపోయిన సైన్యంలా లక్షలాది సంఖ్యలో పారిపోయి వచ్చేస్తున్నాయట. చీమ తోడిచీమలు.

మన చీమకి ఒక క్షణం సేపు ఏమీ అర్థం కాలేదట. ఏదో ఆపద సంభవించి వుంటుందని ఆ వెంటనే మాత్రం గ్రహించగలిగిందట. అప్పుడది ఒక సోదరణ్ణి ఆపి అడిగిందట,

“అన్నా అన్నా ! ఏమి సంభవించింది ? ఆపదా? ఏ మాపద? ఏం జరిగింది?” అని చాలా ఆత్రుతగా అడిగిందిట.

అన్న చీమ వగర్పుకొంటూ ఆగి –

“ఎవడో రాక్షసుడు మన యింట్లో ప్రవేశించేడు” అని చెప్పి మూర్చపోయిందిట.

అప్పుడు మన చీమ తన సోదరులందర్నీ ఆపి, తన చదువునంతా ఉపయోగించి వారికి ధైర్యం చెప్పి వారందర్నీ ఒకచోట నిలిపి తమ పుట్టలోకి తను వంటరిగా వెళ్ళిందట

అక్కడ ఆ చీమల పుట్టింట్లో అట్టడుగున విశాలమైన ఓ చల్లని గదిలో నల్లని ఒకానొక రాక్షసాకారం చుట్టలు చుట్టుకొని నిద్రపోడానికి సిద్ధమవుతోందట.చూడ్డానికి అది ఎంతో భయంకరంగానూ, చాలా అసహ్యంగానూ కూడా ఉందిట.

ఆ ఆకారాన్ని చూసి మన చీమ –

“ఓయీ! ఎవరు నీవు? మా ఇంట్లోకి మా అనుమతి లేకుండా ఎందుకిలా వచ్చేవు? అది అక్రమం కాదా? అన్యాయం కాదా? మాకు అపకారం చేయడం నీకు న్యాయమేనా?” అని ఆకారాన్ని గౌరవపూర్వకంగానే అడిగిందట మన చీమ.

ఆ ఆకారం చీమ మాటలు విని తలెత్తిచూసి, చీమని కనిపెట్టి, బుసబుసమని నవ్వి ఈవిధంగా చెప్పిందట,

“రే పిపీలికాధమా! నేనెవరిననా అడిగేవు? నేను సుఖభోగిని; నీ పాలిట మాత్రం కాలయముణ్ణి! ఇప్పుడు తెలిసిందా నే నెవరో? తెలిసింది కథ! మరి, నువ్వెవరవో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్చపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవదాదేశం. అందుచేత, మీ చీమ వెధవలంతా కష్టపడవలసించే, మీ కష్టమ్మీద మేం సుఖించవలసినదే! మాకు అదే న్యాయం, అదే ధర్మం! కాదన్నవాణ్ణి కాటేసి చంపుతాం! ఇది మీరు కష్టపడి కట్టుకున్న యిల్లే బాగానే ఉంది. నిర్మాణ కౌశలానికి ముగ్దుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకది, పొండి! మరింక దీని” సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది! అది మా హక్కు. ఆ హక్కు మాకు వీడూ వాడూ ఇచ్చింది కాదు, భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పటినుంచీ నా ఇల్లు. బోధపడిందిరా చిన్నోడా, నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు! మరో పాఠానికి మళ్ళీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవలసి ఉంటుంది. మరందుచేత వేగిరం నడువికృణ్ణుంచి. నాకు రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడు నాకు నిద్రాభంగం మరింక చెయ్యక ప్రాణాల మీద తీపుంటే తక్షణం ఇక్కడ్నించి ఫో!” అని చీమకి ఖచ్చితంగా చెప్పి నిద్రపోవడానికి సిద్ధంగా తలవాల్చిందట ఆ రాక్షసాకారం.

మన చిరుచీమ నివ్వెరపోయిందట.

నువ్వో చిరుప్రాణి వన్నారు. నువ్వు చీమ పేరుగలదాని వన్నారు. నువ్వు దేవభాషలో పిపీలికాని వన్నారు. నువ్వు పిపీలికానివే కాని నువ్వు కూడా బ్రహ్మపదార్థానిచే నన్నారు. నువ్వు అదున్నారు, ఇదన్నారు. అంతే కాని – “నువ్వు కష్టజీవి”

అని మాత్రం అంతవరకూ ఎవ్వరూ చెప్పేరు కారుట చిరుచీమకి. నీ కష్టాన్నిదొంగిలించి ఇతరులు సుఖిస్తారని కూడా ఎవ్వరూ చెప్పలేదుట దానికి. “శాస్త్రాలు” చెప్పని సత్యం “ధర్మాత్ములు” దాచిన సత్యం నిజజీవితంలో ఆ రాక్షసాకారం వల్ల తెలుసుకొని, ఆ నిజానికి కొంతసేపు నిశ్చేష్టురాలయిపోయిందట మన చిరుచీమ. ఆ తరవాత కర్తవ్యం గురించి ఆలోచించనారంభించిందిట. ఆవిధంగా జ్ఞానోదయం కలిగి “బుద్దుడ”యింది కాబట్టి ఆ చిరుచీమకి తనేం చెయ్యాలో వెంటనే తెలిసిపోయిందట.

అప్పుడు మన చీమ ఆ రాక్షసాకారాన్ని సుఖంగా నిద్రపోనివ్వక దానితో ఈవిధంగా చెప్పిందట.

“ఒరే రాక్షసాధముడా! మేం కష్టజీవులమే కావచ్చు, నువ్వు సుఖభోగివే కావచ్చు, కాని నువ్వు మా కష్టాన్ని అపహరించి మాకు అన్యాయం చెయ్యడం మేం సహించం! మేం తిరగబడతాం! నువ్వు చెప్పిన న్యాయం భగవన్న్యాయమైనా సరే అది అన్యాయం కాబట్టి దాన్ని మేం మారుస్తాం! అందుగురించి మేం తిరగబడతాం. మీమీద మేం తిరగబడి తీరుతాం” అని చెప్పిందట మన చీమ ఆ రాక్షసాకారానికి.

చీమ వాక్కు విన్న రాక్షసాకారం మొదట కొంచెం వెటకారంగా నవ్విందట. ఆ తరవాత కోపంగా బుసకొట్టిందట.

రాక్షస కోపానికి చీమ నాయకుడు చిరునవ్వు నవ్వుకొని, పట్టుదలతో పైకివెళ్ళి , సోదరులందరికీ హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారిని వీరులుగా మార్చి “రాక్షసాకారపు భగవన్న్యాయం” మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడ గట్టుకొని ముందుకు రంగంలోకి ఉరికేడట. తత్ఫలితంగా –

శ్యామవనంలో మర్రిచెట్టు కింద ఆ దినం ఓ రాక్షసాకారం విలవిల తన్నుకొని నెత్తురు కక్కుకొని చచ్చిందట. ఆ మేరకి ఆ మూలంగా భూభారం కొంత తగ్గిందట.

*ఆంధ్రజ్యోతి వారపత్రిక జనవరి 17, 1969 సంచికలో తొలిసారి ప్రచురింపబడినది.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles